14-06-2025 12:51:35 AM
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న భారీ బడ్జెట్ సినిమాల్లో ‘రామాయణ’ ఒకటి. ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ రాముడిగా, దక్షిణాది అందం సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీడియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయి పాత్రలను పోషించనున్నారు. నితేశ్ తివారీ దర్వకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.
మొత్తం రెండు భాగాల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలిభాగాన్ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. ఇక రెండో భాగం 2027లో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఫిల్మ్నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. రావణుడి సోదరి శూర్పణఖ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోయిన్లను టీమ్ సంప్రదించగా.. తొలుత అవకాశం ప్రియాంక చోప్రాకు దక్కింది.
అయితే, తన చేతిలో ఉన్న ఎస్ఎస్ఎంబీ29 సహా ఇతర సినిమాలను పూర్తి చేసే క్రమంలో ప్రియాంక ప్రస్తుతం బిజీ షెడ్యూల్తో ఉందట. దీంతో మేకర్స్ ప్రియాంక స్థానాన్ని రకుల్ ప్రీత్ సింగ్తో భర్తీ చేయాలని భావించిందట. ఇదే విషయమై రకుల్ను సంప్రదిస్తే వెంటనే ఓకే చేసిందని తెలుస్తోంది. దీంతో రకుల్ లుక్ టెస్ట్ కోసం టీమ్ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. రకుల్ సినిమాల విషయానికొస్తే.. చివరగా ‘మేరే హస్బెండ్ కీ బీవీ’లో కనిపించింది. ఇంకా ఆమె ‘ఇండియన్3’, ‘దే దే ప్యార్ దే2’ సినిమాలోనూ నటిస్తోంది. మరి ‘రామాయణ’లో శూర్పణఖగా కనిపించే అదృష్టం రకుల్ను వరిం చిందన్న వార్తల ఎంతవరకు నిజమో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వెలువడేంతవరకు ఆగాల్సిందే.