calender_icon.png 24 September, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

24-09-2025 12:11:39 AM

  1. భక్తులకు 16 రకాల ప్రత్యేక వంటకాల పంపిణీకి ఏర్పాట్లు
  2. రోజూ 8 లక్షల లడ్డూల పంపిణీ

తిరుమల, సెప్టెంబర్ 23: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం నిర్వహించిన అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. అక్టోబరు 2 వరకు వేడుకలు జరుగనున్నాయి. ఈసారి సామాన్య భక్తులకే అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

మాడ వీధుల్లో స్వామివారి వాహన సేవలను కనులారా వీక్షించేందుకు గంట ల తరబడి వేచి ఉండే భక్తులకు ఈ ఏడాది ప్రత్యేకంగా 16 రకాల వంటకాలను అందించను న్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సుమారు 35 వేల మంది భక్తులను రీఫిల్లింగ్ పద్ధతిలో గ్యాలరీల్లోకి అనుమతించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మాడ వీధుల బయట ఉన్న భక్తులు కూడా ఉత్సవాలను చూసేందుకు వీలుగా 36 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ ఉంటుంది. రోజూ 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నారు. మూడు వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయగా, 4,700 మంది పోలీసులు, 2,000 మంది టీటీడీ భద్రతా సిబ్బంది భక్తులకు రక్షణ కల్పించనున్నారు.

భక్తుల సేవలో 3,500 మంది శ్రీవారి సేవకులు పాలుపంచుకోనున్నారు. కొండపైకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రతి 4 నిమిషాలకు ఒక బస్సును నడపనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం టీటీడీ సాంకేతికతను వినియోగిస్తోంది.