calender_icon.png 29 June, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాడి మానవహక్కుల ఉల్లంఘనే

29-06-2025 01:22:14 AM

గిరిజన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి 

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఇరవెండి కోసగుంపు, ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాస్టికమైన దుశ్చర్య మానవ హక్కుల ఉల్లంఘన అని బీఎస్పీ  జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్ అన్నారు. అమాయక గిరిజన ఆదివాసులపై జరిగిన దాష్టికముపై సమాచారం తెలుసుకున్న బీఎస్పీ జిల్లా అధ్యక్షులు తమ నాయకులతో కలిసి శనివారం ఇరవెండి కొసగింపు గిరిజన గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసులపై జూన్ 20వ తేదీన ఫారెస్ట్ అధికారులు జరిపిన దుశ్చర్యపై అక్కడి గిరిజన ప్రజానీకాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జీవిస్తున్న గిరిజన మహిళలు బహుజన సమాజ్ పార్టీ నాయకులతో వారిపై జరిగిన దాడిని వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ 1950 నుండి రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతంగా భారతదేశంలో కొంత భూభాగాన్ని ఆదివాసులకు కేటాయించారని తెలిపారు.

ఈ భూభాగంలో ఆదివాసీలు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం నుండి అయినా వారికి అనుకూలమైన ప్రాంతానికి వెళ్లి జీవించే హక్కు రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిందని సూచించారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో భూభాగమంతా గిరిజనులదే అని రాజ్యాంగం చెబుతుంటే వారి భూమిపై ఫారెస్ట్ అధికారులకు పెత్తనం ఎవరిచ్చారు అని సూటిగా ప్రశ్నించారు.రాజ్యాంగం వాళ్లకు కేటాయించిన భూములలో వాళ్లు బ్రతుకుతుంటే హక్కు లేని ఫారెస్ట్ శాఖ వారు వాళ్ళపై భౌతిక దాడికి పాల్పడి ఆదివాసి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అత్యాచారం యత్నం చేయడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.జరిగిన ఘటనపై గిరిజనులకు క్షమాపణలు చెప్పి దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులను శాఖపరమైన చర్యలు చేపట్టకపోగా అమాయక గిరిజనుల చేత అనుకూలమైన తీర్మానాలు వ్రాయించుకోవడంపై ఆయన మండిపడ్డారు.

క్షేత్రస్థాయిలో ఐటీడీఏ పీవో, అనంతరం గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయాల మేరకు జరగవలసిన పాలనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆదివాసులపై జరిగిన దాడిని మానవహక్కుల ఉల్లంఘన క్రింద శాఖ పరమైన చర్యలు చేపట్టకపోతే త్వరలోనే గిరిజన ప్రజానీకాన్ని ఏకం చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రాజ్యాంగబద్ధంగా ఆదివాసుల హక్కులపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.అటవీ ప్రాంతంలో బ్రతికే ఆదివాసులకు బీఎస్పీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎవరు భయపడరాదని అక్కడున్న ఆదివాసి మహిళలకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోళ్లపూడి ప్రవీణ్ కుమార్, జిల్లా కోశాధికారి పీక మల్లికార్జున్ రావు, భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షులు కుమ్మరి రాంబాబు, బూర్గంపహాడ్ మండల అధ్యక్షులు గుగ్గులోత్ సరోజిని, పినపాక నియోజకవర్గ ఇన్చార్జి భూక్య ముత్యాలు, గౌతమ్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.