21-02-2026 12:37:08 AM
రూ 26 లక్షలు మోసపోయిన కొత్తూరు, పాతచీపురుగూడెం వాసులు
దమ్మపేట, ఫిబ్రవరి 20,(విజయక్రాంతి): మండల పరిధిలోని పాతచీపురుగూడెం, కొత్తూరు గ్రామాలకు చెందిన వ్యక్తులు సైబర్ నేరగాళ్ల మోసానికి బలై సుమారు రూ 26 లక్షలు పోగొట్టుకున్నట్లు అశ్వారావుపేట సి ఐ పి నాగరాజు, దమ్మపేట ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.
పాత చీపురుగూడెం, కొత్తూరు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల బారినపడి సుమారు 26 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కు గురైనారనీ, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో సైబర్ నేరగాళ్లు ఆ వ్యక్తులకు ఒకటికి పది రెట్లు లాభం వచ్చేలా చేస్తామని వారికి ఫోన్లో వివిధ రకాల లింకుల ద్వారా ఆశ చూపి సదరు వ్యక్తుల దగ్గర నుండి సుమారు 26 లక్షల రూపాయల మేర మోసం చేయడం జరిగిందనీ, బాధితులు తర్వాత మోసపోయామని గ్రహించి పోలీసు వారిని ఆశ్రయించగా ఇట్టి మోసంపై సైబర్ పోర్టల్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసువారు మండల ప్రజలకు తెలియజేస్తూ సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరూ కూడా ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కు సంబంధించి ఎటువంటి లింకులు కానీ, అలాగే అధిక లాభం వస్తుందని కానీ, తెలియని వాటిల్లో పెట్టుబడులు పెట్టడం గాని, తెలియని ఏపీకే ఫైలు క్లిక్ చేయడం కానీ చేయకూడదని తెలిపారు. ఈ విధంగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని దురాశతో ఎవరూ కూడా తమ యొక్క ఆస్తులు అమ్ముకోవడం గాని, ఈ విధంగా అత్యధిక డబ్బులు వస్తాయనే ఆశతో ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదని తెలిపారు.