18-06-2025 11:57:59 PM
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ అర్వింద్
హైదరాబాద్ (విజయక్రాంతి): బనకచర్లకు కేసీఆర్ హయాంలోనే అనుమతులు లభించాయని, అప్పట్లో జగన్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకొనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాలు స్వీకరించామని.. దివ్యాంగులు అనేక మంది వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని దౌర్భాగ్యపు ప్రభుత్వమిదని విమర్శించారు.
ప్రతి పల్లెలో కాంగ్రెస్ ఇమేజ్ భూస్థాపితమైందన్నారు. బనకచర్ల వల్ల తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుందనే విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సరైన సమాధానం కూడా లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ సర్కారు నాటకాలు ఆడుతుందని ఆరోపించారు. కేసీఆర్ డైరెక్షన్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ఉత్తమ్ చేస్తున్న పనిగా ఆయన ఆరోపించారు. ఇది ముమ్మాటికీ బీజేపీపై బురదజల్లే ప్రయత్నమని చెప్పారు. మహేశ్కుమార్ గౌడ్ వర్క్ లేని వర్కింగ్ ప్రెసిడెంట్గా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహేశ్కుమార్ గౌడ్ ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేశారో అర్థం కావడం లేదన్నారు. ఆనాడు కేసీఆర్, జగన్ కూర్చుని మాట్లాడుకుంటే... ఇప్పుడు చంద్రబాబు, రేవంత్రెడ్డి ఎందుకు కూర్చొని మాట్లాడటం లేదని ప్రశ్నించారు.