24-04-2025 02:12:51 AM
నిజామాబాద్ బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయి రెడ్డి
నిజామాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): పహాల్గాం ఉగ్ర దాడి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదూలకు సరైన గుణపాఠం చెప్పాలి నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి అన్నారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాం లో హిందువులే లక్ష్యంగా నరమేధానికి పాల్పడిన ఉగ్రముఖలనీ ఉరితీయాలని సాయి రెడ్డి డిమాండ్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడి ని నిరసిస్తూ జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గానికి చెందిన వారిని వెతికి చంపడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లతరబడి దేశంపై తెగబడుతున్న పాకిస్థాన్ ప్రోత్సాహక ఉగ్రవాదులు మట్టికర్వక తప్పదని సాయరెడ్డి స్పష్టం చేశారు.
విపత్కర పరిస్థితుల్లో సరిహద్దుల్లో ని భద్రతా బలగాలకు వెన్నుదన్నుగా పిల్లవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తూ భారత ఉపఖండంలో పాకిస్థాన్ ను ఎకాకిని చేయడానికి భావసారూప్యత కలిగిన దేశాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.నరుల రూపంలో ఉన్న నరరూప రాక్షసులను దేశ సరిహద్దులలోనే గుర్తించి గురిచూసి తుపాకీ తూటాలతోనే సమాధానం చెప్పాలని బార్ ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాది ఎర్రం విగ్నేష్ మాట్లాడుతూ హిందువులను ఏరికోరి హత్య చేసి దేశంలోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాన్ని వేదజల్లడానికి పాకిస్థాన్ పన్నిన పన్నాగాన్ని భారతావనిలో పారనివ్వ బోమని తెలిపారు. పహేల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారికి న్యాయవాదులు రెండు నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశాంతరం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి జిల్లాకోర్టు ప్రధాన ద్వారం ముందు నిలబడి ప్లే కార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు.
కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు దిలీల్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు,లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, మాజీ పిపి మధుసూదన్ రావు, పరుచూరి శ్రీధర్, ఎర్రం గణపతి, బిట్ల రవి,పడిగేలా వెంకటేష్, సత్యనారాయణ చౌదరి, జునైద్ అలీ,ఎమ్. ఎ ముబీన్, దయాకర్ గౌడ్, శ్యామ్ బాబు ,ఆశా నారాయణ తదితరులు పాల్గొన్నారు