03-12-2025 06:45:08 PM
కాటారం (పలిమెల) (విజయక్రాంతి): రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ రాష్ట్ర పరిశీలకులు ఫణీంద్ర రెడ్డి బుధవారం పలిమెల మండల కేంద్రంలోని సర్వాయిపేటలో నామినేషన్లు పరిశీలన, మహదేవపూర్ మండలంలోని అంబటపల్లి, ఎల్కేస్వరంలలో నామినేషన్లు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రచార కార్యక్రమాలు, వాహనాలను నిశిత పరిశీలన చేయాలని సూచించారు. నామినేషన్ కేంద్రాలలో సౌకర్యాలు, నామినేషన్ల స్వీకరణ విధానాన్ని సమీక్షించారు.
ఆర్ఓ, ఏఆర్ఓలతో నామినేషన్ పత్రాల పరిశీలన, రికార్డుల నిర్వహణ, నమోదు అభ్యర్థులకు అందించే మార్గదర్శకాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఎఫ్ ఎస్ టి బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని, స్వాధీనం చేసుకున్న వస్తువులు, చేపట్టిన చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి అమలులో పటిష్ట పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.