24 నుంచి పార్లమెంటు సమావేశాలు
సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక
జూలై మూడో తేదీ వరకు కొనసాగే అవకాశం
ఈ నెల 18న వారణాసిలో మోదీ పర్యటన
న్యూఢిల్లీ, జూన్ 11: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకు జరుగనున్నట్టు తెలిసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరటం, మంత్రులకు శాఖలు కూడా కేటాయించిన నేపథ్యంలో ఒక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం చేస్తారు. 18వ లోక్సభ కొత్త స్పీకర్ను సభ ఎన్నుకొంటుంది. పదేండ్ల తర్వాత మోదీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం, ఈసారి సభలో ప్రతిపక్షాలు బలం పుంజుకోవటంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకొన్నది. జూన్ 24 తేదీల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
18న వారణాసికి మోదీ
వరుసగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన నరేంద్రమోదీ ఈ నెల 18న తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించనున్నారు. గత మూడు లోక్సభ ఎన్నికల్లో ఆయన వారణాసి నుంచే గెలుపొందారు. అయితే, ఈసారి మోదీకి మెజారిటీ భారీగా తగ్గింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఒక దశలో ఇతర అభ్యర్థులకంటే వెనుకబడి పోయారు. చివరు లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచారు.
దీంతో ఆయన వారణాసిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. పర్యటనలో భాగంగా రైతులతో ప్రధాని సమావేశమవుతారని సమాచారం. అక్కడి ఆలయాలను సందర్శిస్తారు. దశాశ్వమేథ ఘాట్లో గంగాహారతి కార్యక్రమంలో పాల్గొంటారని కాశీ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ పటేల్ తెలిపారు. మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి.






