30-06-2025 01:55:05 AM
జహీరాబాద్లో స్మార్ట్ ఇండస్ట్రీయల్ పార్కు
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అవలంబి స్తున్న పారిశ్రామిక విధానాలతో ప్రపంచస్థాయి పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమైన గమ్యస్థానంగా నిలుస్తోంది. ఇప్పటికే జాతీయ, అంతర్జా తీయ పరిశ్రమలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తెలంగా ణలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలు పరిశ్రమలను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.
పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలకమైన ముందడుగు వేసింది. త్వరలోనే 3,245.48 ఎకరాల్లో స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీయల్ సిటీని అభివృద్ధి చేయనున్నది. దీనికోసం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ఇండస్ట్రీయల్ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. హైదరాబాద్-నాగ్పూర్ ఇండస్ట్రీయల్ కారిడార్లో ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రాజెక్టు చేపడుతున్నది.
49 శాతం కేంద్రం..51శాతం రాష్ట్రం..
ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జహీరాబాద్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ ఇండస్ట్రీయల్ కారిడార్లో చేపట్టే ఈ ప్రాజెక్టులో నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ 49 శాతం, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ 51 శాతం భాగస్వామ్యం కలిగి ఉండనున్నది.
పారిశ్రామిక, అనుబంధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే, అత్యాధునిక మౌలిక సదుపాయాలకు కేంద్రంగా జహీరాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా నిలుస్తుంది. తయారీ రంగానికి స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీయల్ సిటీ ద్వారా మరింత ఊతం లభి స్తుంది. దీంతోపాటు మేకిన్ ఇండియా, యాక్ట్ ఈస్ట్ పాలసీకి సహకారాన్ని అందిస్తుంది.
న్యాల్కల్, ఝరాసంగంలో ఏర్పాటుకు ప్రతిపాదన..
సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో స్మార్ట్ ఇండస్ట్రీయల్ ఇంటిగ్రేటెడ్ సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రతిపాదించిన జహీరాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలకు అనుకూలం గా ఉన్నది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 125 కిలోమీటర్ల పరిధిలోనే ప్రాజెక్టు కేంద్రీకృతం అవుతుండటంతో పారిశ్రామికాభివృద్ధి ఎంతో ఉపయోగపడుతుంది. అయి తే ప్రాజెక్టు ఏర్పాటు చేసే 3,245.48 ఎకరా ల్లో దాదాపు 2,961 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండగా, మిగిలిన 284.48 ఎకరాలు మాత్రం పట్టా, అసైన్డ్ భూములు గా ఉన్నాయి.
91శాతం భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో మిగిలిన 9 శాతం భూసేకరణ చేపడుతున్నారు. జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రీయల్ సిటీ ఏపీలోని కృష్ణపట్నం ఓడరేవుకు 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రాజెక్టుకు చేరువలోని ప్రధాన ఓడరేవుగా మారుతుంది. మనోహరాబాద్లోని ప్రతిపాదిత మలీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు 110 కిలోమీటర్ల ఉంటుంది. రోడ్డు, విద్యుత్ సదుపాయం, కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి సౌకర్యాలు స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీయల్సి టీ ప్రాజెక్టు ఏర్పాటులో కీలకంగా నిలుస్తున్నాయి.
తయారీరంగానికి ఊతం..
ఆటోమొబైల్ రంగంలో పేరొందిన మహీంద్రా ప్లాంట్తో పాటు పలు ప్రముఖ తయారీ కంపెనీలకు నిలయంగా ఉన్న జహీరాబాద్, స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీయల్ సిటీ ఏర్పాటు జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రాజెక్టుగా గుర్తింపు పొందుతుంది. పలు అంతర్జాతీయ తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను తెలంగాణ కేంద్రంగా నిర్వహిస్తుండటంతోపాటు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో భవిష్యత్లో తయారీ రంగంలో మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం లభిస్తుంది. జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఇటీవల కాలంలో జాతీయ పెట్టుబడి, తయారీ జోన్లకు సంబంధించిన ప్రతిపాదిత జాబితాలో కూడా నిలుస్తుండటం విశేషం.