1:10 నిష్పత్తిలో పీసీ జ్యూయెలర్స్ షేరు విభజన
హైదరాబాద్, డిసెంబర్ 17: ఆభరణాల రిటైల్ చైన్ నిర్వహిస్తున్న పీసీ జ్యూయెలర్స్ షేరును 1:10 నిష్పత్తిలో విభజించింది. ప్రతీ ఒక షేరును 10 ఈక్విటీ షేర్లగా విభజించగా, ఇందుకు డిసెంబర్ 16 రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. విభజన అనంతరం వరుసగా రెండు రోజులూ 5 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్ను తాకిన పీసీ జ్యువెలర్స్ మంగళవారం బీఎస్ఈలో రూ.19.25 వద్ద ముగిసింది.
రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా ఇటీవల కంపెనీ బోర్డు బ్యాంక్ల కన్సార్షియంకు ప్రిఫరెన్సియల్ ప్రాతిపదికన రూ.10 ముఖవిలువగల 5.18 కోట్ల షేర్ల కేటాయింపును ఆమోదించింది. ఈ మేరకు కన్సార్షియంకు ఒక్కో షేరుకు రూ.292 ధరతో 5.18 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో పీసీ జ్యుయెలర్స్ రూ.505 కోట్ల ఆదాయంపై రూ. 124 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని ఆర్జించింది.




