16-06-2025 02:10:02 AM
మహబూబాబాద్, జూన్ 15 (విజయ క్రాంతి): మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శాంతి చరిత్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 17న హైదరాబాద్ లో జరుగు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేసముద్రం, ఇనుగుర్తి సంయుక్త మండలాల కార్యదర్శి కొట్టం అంజయ్య పిలుపునిచ్చారు. కేసముద్రం అంబేద్కర్ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే కుట్రలో భాగంగా మూడోసారి కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా మధ్య భారతంలో మావోయిస్టుల అణచివేత పేరున వందల మంది మావోయిస్టులు, ఆదివాసులను నిర్ధాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ ప్రకారం నడవాల్సిన బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పనిచేస్తుందని విమర్శించారు.
ప్రజాస్వామ్యం పట్ల ప్రధాని మోడీకి గౌరవం లేదని, బడా కార్పొరేట్ శక్తులు అయిన అంబానీ, ఆదానిలకు అనుకూలంగా పరిపాలన సాగిస్తునదని ధ్వజమెత్తారు. మావోయిస్టులు శాంతి చేర్చలకు సిద్ధమని ప్రకటించినా, కేంద్ర ప్రభుత్వం హత్యాకాండ ఆపడం లేదని, ఆదివాసీలు, మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా అని ప్రశ్నించారు. గతంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఉద్యమ సంస్థలతో చర్చలు జరిపిన సందర్భాలున్నాయని, ఇప్పుడు మాత్రం మోడీ ప్రభుత్వం చర్చలకు తావు లేకుండా నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు.
వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బట్టు నాగేశ్వరరావు, పిన్నోజు చంద్రమౌళి, బబ్బులు వెంకన్న, బట్టు వెంకన్న, నూకల లింగస్వామి, బెజ్జంకి బ్రహ్మచారి, పానుగంటి సుధాకర్ పాల్గొన్నారు.