calender_icon.png 17 June, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా లారీ జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు

16-06-2025 06:23:49 PM

ఎనిమిది ఓట్ల మెజారిటీతో అధ్యక్షునిగా అనిల్ కుమార్ ఎన్నిక..

అభినందించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాజకీయ జోక్యం, వివాదాలు అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారడంతో స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని(MLA Kunamneni Sambasiva Rao) ప్రత్యేక చొరవతో ఎట్టకేలకు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా నియమించబడిన ప్రభుత్వ సొసైటీ అధికారి పర్యవేక్షణలో పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హల్లో ఉత్కంఠభరితంగా ది సింగరేణి టిప్పర్స్ అండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(The Singareni Tipper and Lorry Owners Welfare Association) ఎన్నికలు నిర్వహించారు.

అసోసియేషన్ అధ్యక్ష పదవికోసం జరిగిన ఎన్నికల్లో బూర్గుల అనిల్ కుమార్ 8 ఓట్ల మెజారిటీతో తానంగి రవికుమార్ పై గెలుపొందారు. మొత్తం 112 ఓట్లకు గాను 109 ఓట్లు పోలవగా ఒక ఓటు చెల్లలేదు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ కుమారుకు 58 ఓట్లు పోలయ్యాయి, రెండో స్థానంలో నిలిచినా తానంగి రవికుమారుకు 50 ఓట్లు పోలయ్యాయి. అనిల్ కుమార్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించి ధ్రువపత్రం అందజేశారు, రెండేళ్లపాటు అసోసియేషన్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ కొనసాగనున్నారు. 

సమిష్టి నిర్ణయాలతో కార్యకలాపాలు నిర్వహించాలి..

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..

సభ్యుల అందరి ఆమోదం, సమిష్టి నిర్ణయాలతో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిస్కారంకోసం కలిసికట్టుగా కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. అధక్షునిగా ఎన్నికైన అనిల్ కుమార్, రెండో స్థానంలో నిలిచిన రవికుమార్  తమ మద్దతుదారులతో సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనిల్ కుమారుని, రవికుమారును పూలమాల, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గెలుపొందిన రవికుమారుకు శుభాకాంక్షలు తెలిపారు.

గెలుపోటములు ఎన్నికలవరకే పరిమితం చేసి పరస్పర సహకారంతో అస్సోసియేషనును ముందుకు తీసుకుపోవాలని, ఎలాంటి సమస్యలున్నా స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికలు జరిగాయని, ఎలాంటి రాజకీయ ప్రమేయంలోకుండా స్వయం ప్రతిపత్తితో అస్సోసియేషన్ను నడిపించాలని, ఆర్ధిక లావాదేవీల విషయంలో ఎలాంటి అవినీతికి తవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు గానగళ్ల వీరస్వామి, రుద్రంపూర్ సిపిఐ శాఖా కార్యదర్శి తోట రాజు తదితరులు పాల్గొన్నారు.