పాదచారులు జీబ్రా క్రాసింగ్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలి
మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి
కందుకూరు,ఏప్రిల్ 13 ( విజయ క్రాంతి ): అరైవ్ అలైవ్ - రోడ్డు సేఫ్టీ వీక్ (Arrive Alive - Road Safety Week) కార్యక్రమంలో భాగంగా సోమవారం కందుకూరు మండలం దావుద్గూడ తండాలో రోడ్డు భద్రతా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు.ఫ్యూచర్ సిటీ కమిషన రేట్ మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి,కందుకూరు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు ఈకార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.హెల్మెట్,సీట్ బెల్ట్ వంటి రక్షణ పరికరాలు వినియోగించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.మద్యం సేవించి వాహనం నడపడం,మొబైల్ ఫోన్ వినియోగించడం,అధిక వేగంతో ప్రయాణించడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.పాదచారులు జీబ్రా క్రాసింగ్లను వినియోగించడం,ట్రాఫిక్ సిగ్నల్స్ను గౌరవించడం వంటి నిబంధనలు పాటించాలని సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయస్సు నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ప్రజల సహకారం ఉంటేనే ప్రమాదాలను అరికట్టడం సాధ్యమవుతుందని వారు తెలిపారు.సురక్షిత ప్రయాణం మన చేతుల్లోనే ఉంది అని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కందుకూరు ఎంపిడిఓ బానోతు సరిత,స్థానిక గ్రామ సర్పంచ్,గ్రామస్తులు పాల్గొన్నారు.




