అర్హులైన వారికి వెంటనే పెన్షన్ లు ఇవ్వాలి
కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్
మెట్ పల్లి, ఆగస్ట్17 (విజయక్రాంతి): అర్హులైన బీడీలు చేసే మహిళలకు, వృద్ధులకు పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మెట్ పల్లి పాత బస్స్టాండ్ ప్రాంగణంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ 2014లో కేసీఆర్ బీడీ పెన్షన్ను ప్రారంభించారని, దేశంలోనే బీడీ కార్మికులకు ప్రత్యేక పెన్షన్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మొదట వేయి రూపాయలు పెన్షన్ అందించి, అనంతరం రెండు వెలకు పెంచారని, ఈ పెన్షన్తో బీడీ కార్మిక మహిళలు ఆత్మగౌరవంతో జీవించారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో లక్షలాది మందికి ఆసరా పెన్షన్లు అందించామని, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నోట్ల రద్దు అయిన పెన్షన్లు ఆపలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా వితంతులకు పెన్షన్లు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో పెన్షన్ నాలుగు వెలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కనీసం రెండు వెల పెన్షన్ అయినా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని, కేసీఆర్ కిట్ను తిరిగి ప్రారంభించాలని ఎమ్మెల్యే సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బీడీ కార్మిక మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మెట్పల్లి ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు.






