ప్రజలు ముందస్తు శుభాకాంక్షలు చెప్తున్నారు

30-04-2024 02:20:06 AM

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 

మేడ్చల్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): మల్కాజిగిరి ప్రజల మనసులో ఉన్న మాటలనే మాజీ మంత్రి మల్లారెడ్డి తనతో చెప్పారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో ఆయన మాట్లాడుతూ.. రెండు లక్షలకుపైగా మెజార్టీతో గెలుస్తున్నామని ప్రజలు తనకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని చెప్పారు. మల్లారెడ్డి తన మనసులోని మాటను దాచుకోలేకనే తనతో ‘అన్నా.. నీవే గెలువబోతున్నావ్’ అని ముందస్తుగా చెప్పారని గుర్తుచేశారు. ఓబీసీలు, దళితులు, గిరిజనులను, మహిళలను మంత్రులుగా చేసిన చరిత్ర బీజేపీదని చెప్పారు. బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కామ్‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గుళ్ల చేసిందని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రకటనలు, వార్తలు ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టంచేశారు.