calender_icon.png 26 June, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాన్ని ఒప్పుకోవాలని ముగ్గురు యువకుల్ని తుపాకులతో పోలీసుల బెదిరింపు..

25-06-2025 11:28:07 PM

పోలీసు వాహనాన్ని అడ్డుకున్న ప్రజలు..

అంబేద్కర్ నగర్ లో ఉద్రిక్తత...

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఓ హత్యాయత్నం ఘటనలో ముగ్గురు యువకుల్ని పోలీసులు తుపాకులతో బెదిరించి నేరాన్ని ఒప్పించే ప్రయత్నాన్ని ప్రజలు అడ్డుకొని పోలీసు వాహనాన్ని దిగ్బంధనం చేసిన సంఘటన బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు వ్యవహరించిన తీరు బెల్లంపల్లిలో కలకలం రేపింది. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 22న కాశిరెడ్డిపల్లి సమీపంలో మధుకర్ అనే వ్యక్తిపై ముత్తునూరు అభిరామ్, పసులేటి సాయి కృష్ణ, గోమాత ఆకాష్ దాడి చేయగా వారిపై అత్యాయత్నం కేసు నమోదయింది. సదరు ముగ్గురు వ్యక్తులను పోలీసులు సివిల్ కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్ట్ సరిగా లేదని న్యాయమూర్తి వారిని తిరిగి పంపించారు. ఈ విషయంలో పోలీసులు రిమాండ్ నివేదికలో తప్పులను సరిదిద్దుకోవడానికి సదరు ముగ్గురు వ్యక్తులను అంబేద్కర్ నగర్ పోచమ్మ చెరువు కట్టకి సమీపంలో పోలీసులు తీసుకెళ్లారు. తుపాకులు చూపించి నేరని అంగీకరించాలని బెదిరించారని బస్తివాసులు ఆరోపించారు. 

విషయం తెలిసిన  బస్తివాసులు పెద్ద ఎత్తున వచ్చి పోలీసు వాహనాన్ని చుట్టుముట్టారు. తమ పిల్లలను ఎందుకు బెదిరిస్తున్నారని పోలీసులతో తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. అక్కడ నుంచి ముగ్గురు నిందితులను తీసుకొని హడావుడిగా పోలీసులు వెళ్లిపోయారు. మరికొందరు పోలీసులు అక్కడే ఉండిపోయారు. బస్తివాసులు దిగ్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చేసేదేం లేక పోలీసులు వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనాన్ని తెప్పించుకొని పోలీసులు కూడా వెళ్లిపోయారు. రెండు గంటలకు పైగా పోలీస్ వాహనం ప్రజల ముట్టడిలో చిక్కిపోయింది. పోలీసులు తమ పిల్లల ప్రాణాలకి హాని చేయాలని ఉద్దేశంతోటే చెరువుకట్ట శివారు ప్రాంతానికి తీసుకువచ్చారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి.

జడ్జి తప్పుడు రిపోర్టును అభ్యంతరం చెప్పడంతో పోలీసులు యువకులను తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాలి. అలా చేయకుండా ముగ్గురు యువకులను పోచమ్మ చెరువు కట్ట మీదుగా తీసుకువచ్చి వారిని వాహనం దిగి  పరిగెత్తాలని  బెదిరించారని బస్తీ వాసులు తెలిపారు. యువకులను తీసుకొని పోలీసులు మూడు వాహనాలలో పోచమ్మ చెరువు కట్ట ప్రాంతానికి వెళ్లడం కలకలం రేపింది. వారిని స్థానికులు, నిందితుల బంధువులు చూసి పోలీసు వాహనాలను అడ్డుకోవడంతో యువకుల ప్రాణాలు దక్కాయని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు.

ఇదే క్రమంలో రెండు వాహనాలలో నిందితులను అక్కడనుండి తీసుకెళ్లగా మరో వాహనాన్ని బాధిత కుటుంబాలు, బస్తీ వాసులు అడ్డుకున్నారు. వారికి ఎటువంటి హాని జరిగినా  పోలీసులదే బాధ్యతని నిందితుల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు హెచ్చరించారు. వాహనాన్ని అడ్డుకున్న మహిళల పట్ల కొంతమంది పోలీసులు అనుచితంగా వ్యవహరించారని బాధ్యత కుటుంబాలు ఆరోపించాయి. ఏదేమైనా ఓ కేసులో నిందితులను రిమాండ్ చేయడంలో పోలీసులు తప్పుడు రిపోర్టును సవరించుకునేందుకు  పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంమైంది.