26-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రమాదం జరిగిన వారం లోపు రూ.1.5లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అమలుపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించాలని, ప్రమాద వివరాలు, క్షతగాత్రుల వివరాలు ఈ-ధార్లో నమోదు చేయాలని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద నమోదైన ఆసుపత్రుల్లో మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు, షాట్ చైర్మన్ శివసేనారెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీలు, యూనిసెఫ్, ఎన్ఐసీ ప్రతినిధులు, వివిధ అధికారులు పాల్గొన్నారు.