calender_icon.png 3 June, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం

02-06-2025 02:35:20 AM

  1. 11 ఏళ్ల నుంచి అవినీతి రహిత పాలన
  2. కాంగ్రెస్ పాలనలోనే కుంభకోణాలు
  3. దేశ ప్రజల స్థితిగతులపై రాహుల్‌కు అవగాహన లేదు..
  4. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఆయన వల్లె వేస్తారు..
  5. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): పదకొండేళ్ల ప్రధాని మోదీ పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం వచ్చిందని, వారి నమ్మకాన్ని మోదీ చూరగొన్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర కిషన్‌రెడ్డి కొనియాడారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన పార్టీ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఒక్కరూపాయైనా అవినీతికి తావు లేకుండా మోదీ పాలన కొనసాగించారని శ్లాఘించారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని దుయ్యబట్టారు. వారి పాలనలోనే హైదరాబాద్‌లోని పలుచోట్ల ఉగ్రవాదులు బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించారని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉపేక్షించదన్నారు. అందుకు నిదర్శనమే ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలకు కేవలం 32 శాతం నిధులు వచ్చేవని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాతం 42కు పెరిగిందని వెల్లడించారు. జీఎస్టీ విధానం అమలులోకి తీసుకొచ్చి అవినీతిచ రహిత పన్నుల విధానానికి నాంది పలికామన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన వ్యాసాలను ఆయన సభల్లో వల్లె వేస్తారని పేర్కొన్నారు.

బీజేపీ పాలనలో భారత్ ఇప్పుడు అమెరికాకు ఐఫోన్ల ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందన్నారు. రక్షణ రంగంలోనూ దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగామని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేస్తున్నామని, వాటి ప్రపంచవ్యాప్తంగా 53 దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి తెలంగాణను ఆర్థిక సంభంలోకి నెట్టివేశాయని మండిపడ్డారు.

సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతు న్నాయే తప్ప.. చేతల్లో చూపటం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి బీజేపీ వంటి డబుల్ ఇంజిన్ సర్కార్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. వచ్చేసారి రాష్ట్రంలో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయపరంగా కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని, వీరి డ్రామాలో రాష్ట్ర ప్రజలు పాత్రధారులు, సూత్రధారులు కానవసరం లేదన్నారు.

వారి ఆస్తులు, అంతస్థులు, పదవుల గొడవల్లో ఎవరూ తలదూర్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 5న తేదీన బీజేపీ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 8 నుంచి 18 వరకు సుపరిపాలన కార్యక్రమాలు చేపడతామన్నారు.

20న ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రమంత్రి వెంట పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, పార్టీ సంస్థాగత ఇన్‌చార్జి అభయ్‌పాటిల్, పార్టీ కర్ణాటక, మహారాష్ట్ర సహ ఇన్‌చార్జి సుధాకర్‌రెడ్డి, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ ఇతర నేతలు ఉన్నారు.