05-05-2025 07:13:21 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన భూభారతి చట్టం(ఆర్వోఆర్ చట్టం–2025) ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు వేదికలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని, ఈ చట్టం అమలుతో ధరణి చట్టానికి ముందున్న సాధాబైనమా ప్రక్రియ తిరిగి వినియోగంలోకి రానుందని తెలిపారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే తహసిల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. నూతన చట్టం ప్రకారం భూ సమస్యలపై ప్రజలు దరఖాస్తు చేస్తే, సంబంధిత అధికారులు నిర్ణిత గడువులోగా విచారించి, పరిష్కార చర్యలు చేపడతారని పేర్కొన్నారు. నేటి నుండి కుంటాల మండలంలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయని, ప్రజల నుంచి భూసంబంధిత దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. అనంతరం సదస్సులో పాల్గొన్న ప్రజలు, రైతుల సమస్యలను కలెక్టర్ స్వయంగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సందీప్ కుమార్, తహసిల్దార్ రాజు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.