24-02-2026 12:00:00 AM
మహబూబ్ నగర్ టౌన్, ఫిబ్రవరి 23 : జిల్లాలో జరుగుతున్న ఎన్నికల జాబితా సవరణ సర్వేను పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు తక్షణమే బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి, వారు బూత్ స్థాయి అధికారులతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బి ఆర్ ఎస్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కు బీఎల్ఏలను నియమించడం ద్వారా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 65 శాతం ఎలెక్టోరల్ రోల్ సవరణ సర్వే పూర్తి అయిందని. ప్రోజని మ్యాపింగ్ కూడా 64 శాతం పూర్తి అయిందని అన్నారు.
అంతకుముందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కి 87ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్ డి ఓ నవీన్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.