13-06-2025 12:28:04 PM
బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకున్నా
బాధను మాటల్లో చెప్పలేను: ప్రధాని మోదీ
విమానాశ్రయంలో అధికారులతో నరేంద్ర మోదీ సమీక్ష
గుజరాత్: అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం(Air India Plane Crash) కూలిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని వైద్యులకు సూచించారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో ప్రమాద మృతుల గుర్తింపు కోసం డీఎన్ఏ నమూనా సేకరించారు. ప్రధాని మోదీ వెంట విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష్ సింఘ్వీ ఉన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ విమానాశ్రంలో(Ahmedabad Airport ) ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని మోదీ తెలిపారు. బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకున్నానని చెప్పారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలంగా ఉంటుందని తెలుసన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేనని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.