ములుగులో ఎన్కౌంటర్.. కొత్తగూడలో హై అలర్ట్
హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ దృష్ట్యా కొత్తగూడలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మరణించిన వారిలో మావోయిస్టు కీలక నాయకులు ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లో యెల్లందు- నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ బద్రు (35), అగోళపు మల్లయ్య (43), ముస్సాకి దేవల్ (22), ముస్సాకి జమున (23), జైసింగ్ (25), కిషోర్ (22), కమేష్ (23) మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ నుంచి కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చల్పాక అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహిస్తున్నారు. కొందరు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. మహబూబాబాద్ ప్రధాన రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. శనివారం, సరిహద్దు భద్రతా దళానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఒడిశాలో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, నిషేధిత సంస్థలోని 60-70 మంది సభ్యులు మాత్రమే రాష్ట్రంలో చురుకుగా ఉన్నారని చెప్పారు.




