4 June, 2026 | 2:13 AM

మొయినాబాద్‌లో ఆటో చోరీల మిస్టరీ ఛేదించిన పోలీసులు

04-06-2026 01:31 AM

ఇద్దరు ఆటో దొంగతనం కేసులతో పాటు బైక్ చోరీ కేసు వెలుగులోకి..

వివరాలు వెల్లడించిన మొయినాబాద్ ఎస్హెచ్‌ఓ మల్లికార్జున రెడ్డి 

మొయినాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మొయినాబాద్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు ఆటో దొంగతనం కేసులను మొయినాబాద్ పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, మే 27న మొయినాబాద్ ప్రధాన రహదారిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా పార్క్ చేసిన ఓ ఆటోను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.

అదే సమయంలో ఓల్ అజీజ్నగర్ సమీపంలో మరో ఆటో చోరీకి గురైంది. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొయినాబాద్ క్రైమ్ పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుడు వడ్డె వెంకటేష్ అలియాస్ కొమురే వెంకటేష్ (25), పాపిరెడ్డి నగర్ కాలనీ, చందానగర్కు చెందినవాడని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్గా, కూలీగా పనిచేస్తున్న అతడు ఆర్థిక అవసరాల నిమిత్తం చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు సదాశివపేట ప్రాంతంలో జరిగిన ఓ మోటార్ సైకిల్ చోరీ కేసులో కూడా తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు వెల్లడించారు.నిందితుడు అలవాటుపడిన నేరస్థుడని, గతంలో ఆటో చోరీలు, ఇంటి చోరీలు, పోక్సో కేసుల్లో కూడా జైలుశిక్ష అనుభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు.నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన క్రైమ్ పోలీసు అధికారులను, సిబ్బందిని మొయినాబాద్ ఎస్హెచ్‌ఓ మల్లికార్జున రెడ్డి అభినందించారు. ప్రజలు తమ వాహనాలను భద్రంగా పార్క్ చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.