24 March, 2026 | 2:48 AM

డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసుల కఠిన చర్యలు

24-03-2026 12:00 AM

66 మందికి జరిమానాలు

వెంకటాపూర్, మార్చి 23 (విజయక్రాంతి): మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక వాహన తనిఖీలు ఫలితాన్నిచ్చాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సోమవారం పోలీస్ స్టేషన్లో కౌన్స్లింగ్ నిర్వహించారు.

మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే ప్రభావం వంటి అంశాలను పోలీసులు వారికి వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చేయవద్దని గట్టిగా హెచ్చరించారు. అనంతరం మొత్తం 66 మందిని జిల్లా కోర్టుకు తరలించగా, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వారి కేసులను విచారించి తగిన జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా ఎస్త్స్ర చల్లా రాజు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమేకాక ప్రాణాంతకమని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు సహకరించి సురక్షిత రవాణాకు తోడ్పడాలని కోరారు.