06-06-2025 12:00:00 AM
తెలుగు చిత్రసీమలో సంక్రాంతికి ఉండే క్రేజీయే వేరు. అందుకే చాలా మేకర్స్ తమ సినిమా సంక్రాంతి పర్వదినాల్లో చిన్నదా, పెద్దదా అన్న తేడా లేకుండా సంక్రాంతి బరిలో నిలిపేందుకే మొగ్గుచూపుతుంటారు. సంక్రాంతికి ఇంకా ఆర్నెల్ల సమయం ఉంది. కానీ, టాలీవుడ్లో ఆ పోటీ ఇప్పట్నుంచే కనిపిస్తోంది. తమ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే విడుదల తేదీని ప్రకటించడం ద్వారా పండగ బరిలో తాము ఉంటున్నాని చెప్పకనే చెప్పేస్తున్నారు.
దీంతో ఈసారి పండక్కి బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అన్నట్టుగా ఉండనుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. గత ఏడాది సంక్రాంతి బరి నుంచి అనూహ్యంగా తప్పుకున్న స్టార్స్ మళ్లీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం అనివార్యంగా కనిపిస్తోంది. ‘విశ్వంభర’ గత ఏడాది సంక్రాంతి పండక్కి రావాల్సి ఉండగా, కొడుకు రామ్చరణ్ నటించిన ‘గేమ్ఛేంజర్’ కోసం చిరంజీవి తప్పుకోవాల్సి ఉంది.
రవితేజకు సైతం నిరుడు పండగ బరి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని చిత్ర పరిశ్రమ కష్టాల్లో పడకుండా చూశారు. ఇలా వీరిద్దరితోపాటు మరో యువ హీరో సినిమా సైతం ఈసారి సంక్రాంతికి వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇలా ఇప్పటికే మూడు సినిమాలు సంక్రాంతికి సందడి చేయనున్న విషయం స్పష్టం కాగా, పండగ నాటికి మరెంత మంది పోటీలో పాల్గొననున్నారనేది ఆసక్తిగా మారింది.
‘మెగా157’ సినిమా..
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మెగా157’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా ఎంపికైంది. సాహు గారపాటి, సుస్మిత సంయుక్తంగా నిర్మి స్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ముహూర్తం చేసిన రోజే ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించారు. దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.
నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’..
యువ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న తాజాచిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఆయన కథానాయకుడి గా నటిస్తున్న ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తుండగా సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా 2026, జనవరి 14న విడుదల చేయనున్నట్టు టీమ్ ఇటీవలే ప్రకటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
పండక్కి ‘మాస్ జాతర’
రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ షూటింగ్ శరవేగంగా ప్రస్తుతం జరుగుతుండగానే మరో సినిమాను ప్రకటించారు. రవితేజ కెరీర్లో 76 చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ ఆసక్తికర పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్లో రవితేజ ఒక బిజినెస్ క్లాస్ ఫ్లుటైలో కూర్చోని ఉన్నాడు. ఓ చేతిలో స్పానిష్ నేర్చుకునే బుక్, మరో చేతిలో షాంపైన్ బాటిల్తో ఉన్న రవితేజ వెనుక వైపు నుంచి కనిపిస్తున్న లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.