20-06-2025 01:11:25 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయ క్రాంతి): తెలంగాణలో సం చలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు సిట్ విచారణకు ఏమాత్రం సహకరిం చడం లేదని తేలడంతో, దర్యాప్తు సంస్థ తీవ్ర అసహనానికి గురైంది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్న సిట్ అధికారులు, ఆయనకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిలీఫ్ను రద్దు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
అదేవిధం గా ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నా రు. గురువారం నాలుగోసారి సిట్ ఎదు ట విచారణకు హాజరైన ప్రభాకర్రావును అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు విచారించిన సిట్ అధికారులు, మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఇచ్చి న స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్రావుకు పలు కీలక ప్రశ్నలు సంధించా రు.
అయితే, ఆయన సమాధానాలు చెప్పేందు కు మొండికేసినట్లు, పదే పదే ఒకే సమాధానం చెప్పినట్లు సమాచారం. దీంతో దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని భావించిన సిట్ బృందం కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. విచారణలో ప్రధానంగా 2023, నవంబర్ 15న ఏకంగా 600 మంది ఫోన్లను ట్యాప్ చేసిన వ్యవహారంపై సిట్ అధికారులు ప్రభాకర్రావును ప్రశ్నించారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని సిట్ గుర్తించింది. గతంలో ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్రావు వంటి ఇతర నిందితులు, సాక్షుల నుంచి సేకరించిన స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇప్పుడు నాలుగో విచారణలో, ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షించి చేసిన ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది.
నిందితులను వరుసగా విచారిస్తున్న సిట్, మరోవైపు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వేలాదిమంది ఫోన్లను రహస్యంగా వినడమే కాకుండా ఆ వాయిస్లను వారికే వినిపించి బెదిరించడం, వారి కదలికలను ముందుగానే పసిగట్టి నిలువరించినట్లు తెలుస్తోంది. వాయిస్ డేటా ట్రాన్స్ఫర్ కోసం అధికారులు పెద్దసంఖ్యలో పెన్డ్రైవ్లు వినియోగించినట్లు సమాచారం.
దాదాపు 5 నుంచి 6 వేల పెన్డ్రైవ్లు కొనుగోలు చేసి ట్యాప్ చేసిన ఫోన్ కాల్ సంభాషణలకు సంబంధించిన వాయిస్ డేటాను తమకు ఆ పని అప్పగించిన అధికారులకు లేదా లీడర్లకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించిన పెన్డ్రైవ్లపై సిట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పాకడంతో తెలుగు రాష్ట్రాలను ఈ అంశం షేక్ చేస్తోంది. ప్రస్తుతం కేసు విచారణను తెలంగాణ పోలీసులు డీల్ చేస్తున్నారు. రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న నాటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్కుమార్, గతంలో కీలక హోదాల్లో పని చేసిన మహేందర్రెడ్డి, నవీన్చంద్ వంటి అధికారుల నుంచి సిట్ ముఖ్యమైన సమాచారం రాబట్టుకున్నట్లు తెలుస్తోంది.
వీరి వద్ద ఎస్ఐబీ చీఫ్ హోదాలో ప్రభాకర్రావు టీమ్ తప్పుడు సమాచారం ఇచ్చి ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో ఒకవేళ సీబీఐ ఎంట్రీ ఇస్తే వ్యవహారం మరోలా ఉండబోతున్నదనే టాక్ వినిపిస్తోంది.
మావోయిస్టుల ముసుగులో రాజకీయ నేతలపై నిఘా..
మావోయిస్టుల సానుభూతిపరుల ముసుగులో రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సిట్ బృందం కీలక సమాచారాన్ని సేకరించింది. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ప్రభాకర్రావును ఓఎస్డీగా నియమించి, ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్కు డిజిగ్నేటెడ్ అథారిటీగా వ్యవహరించే అధికారం కట్టబెట్టడంపై కూడా సిట్ విచారణ చేస్తోంది.
డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలో అనుమానిత ఫోన్లపై కేవలం 7 రోజులు మాత్రమే నిఘా పెట్టేందుకు అనుమతి ఉంటుంది. అంతకుమించి నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి. అయితే, ఎటువంటి అనుమతులు లేకుండానే ఇష్టం వచ్చినట్లు ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.