calender_icon.png 26 September, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి

25-09-2025 10:33:19 PM

- స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై సమీక్ష

- గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను కొనసాగిస్తున్నాం

- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు  సన్నాహాలు ఉపందుకున్న  నేపథ్యంలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై ముఖ్య నాయకులు అనుసరించాల్సిన ప్రక్రియపై అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద చేసిన అప్పులను కడుతూనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలకు చేరువైన సన్నబియ్యం పంపిణి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రేషన్ కార్డుల పంపిణి, ఇందిరమ్మ ఇల్లుల మంజూరు లాంటి పథకాల గురించి ప్రజల్లోకి  పాజిటివ్ గా తీసుకెళ్లాలని సూచించారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నప్పటికి కొన్ని పూర్తిగా నెరవేర్చకపోవడానికి ఉన్న ఇబ్బందులను ప్రజలకు అర్థమయ్యే విదంగా వివరించాలని అన్నారు.

ఛిద్రం చేసిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ధుతూనే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత పాలకులు చేసిన పాపాలకే ఇపుడు ఇబ్బంది పడుతున్నామని, ప్రాజెక్టుల పేరు మీద చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే వ్యవస్థను గాడిలో పెడుతున్న తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లుల మంజూరులో నెలకొన్న ఇబ్బందులు అధిగమించడానికి నిబంధనల సడలింపుపై ప్రభుత్వంతో మాట్లాడి నిజమైన నిరుపేద అర్హులకు నాయ్యం జరిగేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి అనుసరించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చించారు.