వృద్ధాప్యంలో ఆసరాగా ‘ప్రణామ్’
డే కేర్ సెంటర్లో వృద్ధులతో కలసి అల్పాహారం చేసిన కలెక్టర్
ఆదిలాబాద్, (విజయక్రాంతి): వృద్ధాప్యంలో ఒంటరితనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడిపేందుకు ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లు చక్కటి వేదికగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వయోవృద్ధులకు సాంత్వన, మానసిక ఉల్లాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వృద్ధులంతా ‘ప్రణామ్’ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ కేంద్రంలోని వసతులను పరిశీలించారు. వృద్ధులకు అందుతున్న సేవలు, కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ స్వయంగా వృద్ధులకు అల్పాహారం వడ్డించారు. వారితో కలసి అల్పాహారం చేశారు. తమతో కలసి కూర్చొని ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్కు సీనియర్ సిటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న జీవన విధానంతో వయోవృద్ధులు ఒంటరితనానికి గురికాకుండా పగటి సమయంలో ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. వృద్ధులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలతోపాటు మానసిక ప్రశాంతత, సామాజిక భద్రత కల్పించడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. కేంద్రంలో అందించే రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ, వినోద కార్యక్రమాలు, పరస్పర ఆత్మీయత వృద్ధుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.






