క్రికెట్ గ్రౌండ్ నిర్మాణానికి కసరత్తు
రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ లో స్థలాల పరిశీలన
ఖమ్మం టౌన్, మే 7 (విజయక్రాంతి): నగర సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కావాల్సిన సాధ్యాసాధ్యాలపై ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గురువారం అధికారులతో రఘునాధపాలెం మండలం జింకల తండా సమీపంలో గుట్టల ప్రాంతం, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద హైవే వెంట ఉన్న కొండల ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోరిక మేరకు స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలం కోసం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్లు అయన తెలిపారు.
స్టేడియం నిర్మాణానికి విశాలమైన, అనువైన భూమిని గుర్తించే క్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి గుట్టల పైకి కాలినడకన ఎక్కి చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. ఖమ్మం క్రీడాకారుల కలల ప్రాజెక్టు అయిన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, డీవైఎస్ఓ సునీల్ రెడ్డి, రఘునాథపాలెం ఎమ్మార్వో ఎస్.శ్వేత, ఖమ్మం రూరల్ ఎమ్మార్వో విజయేందర్ రెడ్డి, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






