16-06-2025 01:56:11 AM
నికోసియా, జూన్ 15: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ద్వీపదేశమైన సైప్రస్కు చేరుకున్నారు. అనంతరం మోదీ క్రొయేషియాతో పాటు కెనడాలో జరిగే జీ శిఖరాగ్ర సదస్సుకు కూడా హాజరవనున్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని మోదీ మొదటి విదేశీ పర్యటన ఇదే. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ప్రధాని నికోస్ క్రిస్టోడోలైడ్స్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.
15, 16 తేదీల్లో ప్రధాని సైప్రస్లో పర్యటించనున్నారు. భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం గత 23 ఏండ్లలో ఇదే తొలిసారి. సైప్రస్కు చేరుకున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సైప్రస్లో ఉన్న ప్రవాసభారతీయులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ప్రధాని వారితో ముచ్చటించారు.
బిజినెస్ మీట్లో ఇరు దేశాల ప్రధానులు
సైప్రస్కు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ ప్రధానితో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి ఊతమిచ్చేలా వీరివురూ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సైప్రస్తో స్నేహం కోసం భారత్ ఎదురుచూస్తోందని ప్రధాని ట్వీట్ చేశారు.
ఈ భేటీకి సంబంధించి విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ భేటీకి సంబంధించి ట్వీట్ చేశారు. ఇరువురు నేతలు రెండు దేశాల నడుమ సంబంధాల బలోపేతం కొరకు చర్చలు జరిపారని ఆయన తెలిపారు. డిజిటల్ పేమెంట్లు, షిప్పింగ్, షిప్ బిల్డింగ్, నౌకాశ్రయాలు మొదలైన ప్రాంతాల్లో రెండు దేశాల బంధం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు.