12-08-2025 01:08:52 AM
- నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల్లో పట్టువిడుపు ఉండాలి
- మా ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుంది
- హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా తీర్చిదిద్దబోతున్నాం
- సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తోందని, నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల్లో ఇరువై పులా పట్టువిడుపు ఉండాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో సినిమా నిర్మాతలు, వివిధ సినిమా సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టంలో సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్లు నిలిపివేసినందున పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి సహకరించాలని వివిధ సంఘాల సభ్యులను కోరారు.
సినిమా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నామని, ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. బుధవారం నుంచి షూటింగ్స్ పునఃప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను గ్లోబల్ ఫిలీం హబ్గా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. సినిమా, వినో ద రంగంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాష్ర్టంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండటంతో అవి ఉత్తమ సినిమా షూటింగ్ లొకేషన్లుగా ఉపయోగించ వచ్చని చెప్పారు. ఇది స్థానిక ప్రజలకు ఆదాయాన్ని కల్పించడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుందన్నారు. సినిమా కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉండటంతోపాటు సిని పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో ఉందని తెలిపారు. అయితే సమ్మెకు వెళ్లడం సరైన మార్గం కాదని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి పేద సినిమా కార్మికులకు ఇళ్లు ఇవ్వాలని, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించి వారి జీవన ప్రమాణాల ను మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఉన్నారని చెప్పారు.
ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. అన్ని పక్షాల మధ్య ఐక్యత అవసరమని పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్ను గ్లోబల్ ఫిలీం హబ్గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ చర్యలను బలపరిచేలా అందరూ కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, వివిధ సినిమా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.