18-06-2025 08:24:13 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాయి. గొడవలు తీవ్రస్థాయికి చేరుకొని తమ్ముళ్ళు ఇద్దరు కలిసి అన్నను హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) సీరోలు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. ఈ సంఘటన జరుగుతున్న క్రమంలో అడ్డుకోబోయిన తండ్రికి గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు కృష్ణ(43)కు తమ్ముళ్లు నరేష్, మహేష్ మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. తండ్రి లింగయ్య తన ఆస్తిని ముగ్గురు కుమారులతో పాటు కుమార్తెకు కూడా పంచి ఇచ్చాడు.
ఈ క్రమంలో రోడ్డుకు వెనుక వైపు భాగం కృష్ణకు ఇవ్వగా దారి విషయంలో తగాదా చోటుచేసుకుందని గ్రామస్తులు ద్వారా తెలిసింది. బుధవారం ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా చెలరేగడంతో కృష్ణను తమ్ముళ్లు నరేష్, మహేష్ కత్తితో దాడి చేయగా అక్కడికక్కడే మరణించాడు. అడ్డుకోబోయిన తండ్రి కూడా గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా పాల్గొన్నారని, చనిపోయిన కృష్ణ లింగయ్య మొదటి భార్య కుమారుడని, రెండో భార్య కుమారులు నరేష్, మహేష్ ఆస్తి తగాదాలతో అన్నను పథకం ప్రకారం హత్య చేశారని మృతుని బంధువులు పేర్కొన్నారు. సంఘటనపై సిరోల్ ఎస్సై నాగేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.