20-05-2025 12:00:00 AM
మంచిర్యాల, మే 19 (విజయక్రాంతి) : ప్రభుత్వ భూములు అక్రమార్కుల పాలవుతున్నాయని, వాటిని కాపాడండి అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మండలంలో మం దమర్రి శివారు సర్వేనెంబర్ 364లో ఎకరం 30 గుంటలు, మందమర్రి మండలం అదిల్ పెట్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్ర చెరువు అభివృద్ధి కోసం, రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిపై అధికారులకు వినతి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. అలాగే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ పథకాల పేరు తో కబ్జాదారులకు భూములు అప్పగిస్తున్న బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల తీరుపై ఎమ్మార్పీఎస్ నేతలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ఫిర్యాదు చేశారు.
ఎమ్మార్పీఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ మాదిగ, ఇతర ప్రతినిధులతో కలిసి భూ కబ్జా వ్యవహారంపై ప్రజా ఫిర్యాదులో లిఖిత పూర్వకంగా కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇలాంటి అక్రమాలు ప్రభుత్వం మీద ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించే ప్రమాదం ఉంద, ప్రభుత్వ భూముల్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.