ధాన్యం సేకరణ ప్రక్రియలో వేసవి దృష్ట్యా రక్షణ చర్యలు
జిల్లా కలెక్టర్ కె.హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వడగాలులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా వరి ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు, సేకరణ పనులను నిర్వహించే సిబ్బంది రక్షించడానికి నిర్దిష్ట చర్యలను తప్పక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్ వంటి జిల్లాలలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అత్యవసర హెచ్చరికను జారీ చేసిందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు నీడ కల్పించేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులు, హమాలీలకు వడదెబ్బ తగలకుండా నివారించడానికి చల్లటి తాగునీరు, మజ్జిగ, ఓ.ఆర్.ఎస్. అందించే "చలివేంద్రాలను" ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురి కాకుండా రైతులు తమ ధాన్యాన్ని ఉదయం 11 గంటల లోపు / సాయంత్రం 4 గంటల తర్వాత తీసుకువచ్చేలా ప్రోత్సహించాలని, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య కాలంలో ధాన్యం దించడం, తూకం వేయడం వంటి శారీరక శ్రమతో కూడిన బహిరంగ పనులను పరిమితం చేయాలని, రైతులు ఎండలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, ఖచ్చితమైన టోకెన్ / అపాయింట్మెంట్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఐస్ ప్యాక్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక థర్మామీటర్లు కలిగిన ప్రథమ చికిత్స కిట్లు తప్పక అందుబాటులో ఉండాలని తెలిపారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం / 108 అంబులెన్స్ సేవకు సంబంధించిన సంప్రదింపు వివరాలను అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలను గుర్తించేలా అధికారులు, పర్యవేక్షకులకు తగిన శిక్షణ ఇవ్వాలని, కళ్లు తిరగడం / వికారం కలగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గందరగోళం / తీవ్రమైన అలసట లక్షణాల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు.
వడదెబ్బకు గురైన వారిని ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. వడదెబ్బ నుండి కాపాడుకునేందుకు దాహం వేయకపోయినా తరచుగా నీరు త్రాగాలని, టీ / కాఫీకి దూరంగా ఉండాలని, తలను కప్పుకోవడానికి గొడుగులు, టోపీలు / దూది తువ్వాళ్లను వినియోగించాలని, లేత రంగు, వదులుగా ఉండే దుస్తులను ధరించాలని తెలిపారు. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి మజ్జిగ, నిమ్మరసం వంటి వాటిని వెంట తీసుకువెళ్లాలని తెలిపారు. రైతులు ఎద్దుల బండ్లపై వస్తుంటారని ఈ క్రమంలో జంతువుల కోసం ప్రత్యేక నీడ ఉన్న ప్రదేశాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని, పశువులలో వేడి ఒత్తిడిని నివారించడానికి, వాటి తొట్టెలలో తాజా, చల్లని నీటిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. కొన్ని ప్రదేశాలలో తీవ్రమైన వేడి కారణంగా, అకస్మాత్తుగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఈ సందర్భంలో వరి తడవకుండా నివారించడానికి టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన మరి దాన్యం కొనుగోలు ప్రక్రియను ఇలాంటి అవాంతరాలు, అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.






