25 June, 2026 | 1:48 AM

60 గజాల ఇళ్ల స్థలాల్లో మార్కెట్‌యార్డుకు వ్యతిరేకంగా ధర్నా

25-06-2026 01:02 AM
  1. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బాధితుల ఆందోళనకు కృష్ణయ్య మద్దతు
  2. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని.. మార్కెట్ యార్డును వేరే చోట ఏర్పాటు చేయాలని డిమాండ్

మొయినాబాద్ జూన్ 24(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్ సర్వే నంబర్ -151లో పేదలకు గతంలో కేటాయించిన 60 గజాల ఇళ్ల స్థలాల్లో గుడిమల్కాపూర్ మార్కెట్ యార్డును ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. గ్రామస్థులు బుధవారం హైదరాబా ద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. శాంతి యువజన సంఘం, అంబేద్కర్ యువజన సంఘం, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మైనార్టీ యువజన సంఘం, సేవాలాల్ యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని, మార్కెట్ యార్డు ఏర్పాటును నిలిపివేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుని హిమాయత్నగర్ గ్రామస్థులకు పూర్తి హక్కులు కల్పించాలని కోరారు.

సీపీఎం రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ భాస్కర్ పేదలకు కేటాయించిన భూములను కాపాడాలని, ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముదిగొండ రవి యాదవ్, సలీంఖాన్, మాల స్వామి, యువజన సంఘాల అధ్యక్షులు కుమ్మరి విఠల్, కట్టమీది శ్రీను, కరీం, గోపాల్ నాయక్, అశోక్ చారి, షాబాద్ ప్రవీణ్, సందీప్, కావాలి చంద్రయ్య, ఆల్కపురం నందీశ్వర్ రెడ్డి, కాళిదాసు చారి, అఖిల్, కొమ్ము శ్రీకాంత్, రెడ్డిపల్లి సుమన్ తోపాటు నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.