రైతు భరోసా కోసం నిరసన
హైదరాబాద్: రైతులకు రైతు భరోసా( Rythu bharosa) ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్(Nadelli Vijith Kumar) నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు అధ్యక్షతన రైతులకు మద్దతుగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన మూడు విడతల రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజిత్ కుమార్ మాట్లాడుతూ..
రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) మూడు ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇచ్చి, మిగతా రైతులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. రైతులకు వెంటనే ఎగ్గొట్టిన మూడు విడుతల రైతు భరోసాని తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేటప్పటికి రైతు భరోసా పూర్తిగా విడుదల చేయాలని లేకపోతే మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల పక్షాన కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, రైతుల కోసం పోరాడడానికి ఎల్లప్పుడూ బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.




