17-07-2025 01:13:36 AM
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
పటాన్చెరు, జూలై 16 : ప్రభుత్వ పాఠశాలలో సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం పటాన్చెరు లోని గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రంను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు రిజిస్టర్, స్టోరూమ్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్య ద్వారా ఆంగ్ల భాషపై విద్యార్థులకు పట్టువచ్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రాథమిక దశ నుండి ఆంగ్ల విద్యను బోధించడం ద్వారా కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించే అవకాశం ఉందన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజ, పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.