గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై నూతన ప్రజాప్రతినిధులకు శిక్షణ
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం జిల్లా కలెక్టరేట్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను అమలు చేస్తున్నదన్నారు. గ్రామాలలో పారిశుధ్యం, తాగునీరు, విద్య, ఆరోగ్యం, పచ్చదనం, మౌలిక వసతులు వంటి అంశాలపై స్పష్టమైన లక్ష్యాలతో 99 రోజుల ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
గ్రామాభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన పనులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రభుత్వ పథకాల అమలు విధానాలపై అధికారులు సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా పని చేయాలని కలెక్టర్ సూచించారు.గ్రామ అభివృద్ధికి సంబంధించిన 10 ప్రధాన అంశాలపై రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా అధికార యంత్రాంగం వివరించింది.ఈ కార్యక్రమంలోఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్లు మెంగ్రే ఆకాశ్, షాహిద్ సుల్తానా, డీపీవో భిక్షపతి, డీఆర్డీఓ దత్తారావు, సీపీఓ లక్ష్మీనారాయణ, సర్పంచులు, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




