రేప్ కేసుల్లో 15 రోజుల్లోనే శిక్ష
ప్రధానమంత్రికి బెంగాల్ సీఎం మమత లేఖ
కోల్కతా, ఆగస్టు 22: దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం లేఖ రాశారు. ఇలాంటి కేసులో 15 రోజుల్లోనే కోర్టు విచారణ ముగించి నిందితులకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలోని ఆర్జీ కర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో మమత ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది.
సందీప్ ఘోష్కు పాలీగ్రాఫ్ టెస్ట్
డాక్టర్పై అత్యాచారం హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జీ కర్ దవాఖాన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. మరో నలుగురు వైద్యులకు కూడా పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఆర్జీ కర్ దవాఖాన ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసిన సందీప్ ఘోష్ను మమత ప్రభుత్వం వెంటనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్కు ప్రిన్సిపాల్గా నియమించింది. ఈ నియామకంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయటంతో ఆ నియామకాన్ని గురువారం రద్దు చేసింది.






