14 August, 2026 | 3:25 PM

కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే తరలించాలి

25-05-2024 01:10 AM

జిల్లా స్పెషల్ ఆఫీసర్ భారతి హోళికేరి

పటాన్‌చెరు, మే 24 (విజయక్రాంతి) : కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ భారతిహోళి కేరీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం జిన్నారం, గుమ్మడిదల మండల కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మాధురితో కలిసి పరిశీలించారు. జిన్నారం శివారులోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మొత్తం కలియ తిరిగి ధాన్యాన్ని పరిశీలించారు.

జియో ట్యాగింగ్‌పై సిబ్బందిని ఆరా తీశారు. ట్రాన్స్‌పోర్ట్ స్పీడ్‌గా ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీలలో నింపి సంబంధిత రైస్ మిల్లులకు పంపించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను కొనాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అక్కడి రైతులతో ఆమె మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎస్‌వో వనజాత, తహసీల్దార్ భిక్షపతి, వ్యవసాయాధికారి రవీంద్రనాథ్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం నరేందర్, ఏఈవోలు, వీవోలు పాల్గొన్నారు.