పుష్పక్ పరీక్ష విజయవంతం
- మానవ సహిత రోదసి యాత్రకు మరో అడుగు
న్యూఢిల్లీ, జూన్ 23: మానవసహిత రోదసి యాత్రంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది. పునర్వినియోగ వ్యోమ నౌక (ఆర్ఎల్వీ) పుష్పక్ను విజయవంతంగా పరీక్షించింది. స్వయంచాలితంగా భూమిపై సురక్షితంగా దిగే అంశాన్ని ఆదివారం నాటి పరీక్షలో పరీక్షించినట్టు ఇస్రో తెలిపింది. ఈ పరీక్ష ఆదివారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గ్లో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో నిర్వహించారు. ‘వరుసగా మూడోసారి పుష్పక్ సురక్షితంగా భూమిని చేరే పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.
తర్వాతి పరీక్షలో పుష్పక్ భూమి కక్ష నుంచి సురక్షితంగా భూమికి దిగే పరీక్ష నిర్వహిస్తాం. ఇందుకోసం రాకెట్ ద్వారా పుష్పక్ను అంతరిక్షంలోకి పంపుతాం. అంతరిక్ష ప్రయోగాల్లో ఖర్చును తగ్గించటంలో ఇది గేమ్చేంజర్ అవుతుంది. 21వ శతాబ్దంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధిలో ఇది ఆత్మనిర్భర్గా నిలుస్తుంది’ అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ తెలిపారు.






