10-06-2025 12:39:20 AM
మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
మేడ్చల్, జూన్ 9(విజయ క్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిధులతో వంతెనలు నిర్మించనున్నామని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం అల్వాల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాటా అడగకుండా నిధులు మంజూరు చేయాలని రైల్వే మంత్రిని కోరగా 100% నిధులు భరించేలా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
తుర్కపల్లి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, మిగతా వాటికి కేంద్ర ప్రభుత్వమే భరించాలనడంతో రైల్వే మంత్రితో సమావేశమై మిగతా వాటికి మంజూరు తెచ్చామని ఆయన తెలిపారు. బొల్లారం రైల్వే స్టేషన్ పక్కన 1996లో ఆర్ఓబి మంజూరు కాగా, కేంద్ర ప్రభుత్వం 36 లక్షలు నష్టపరిహారం కూడా అందజేసిందని, 30 ఏళ్లయినా అక్కడ వంతెన నిర్మాణం జరగలేదన్నారు.
బొల్లారం రైల్వే స్టేషన్ దగ్గర త్వరలో ఆర్ యు బి నిర్మించబోతున్నామని, జనప్రియ సిగ్నల్ దగ్గర అండర్ పాస్ ను 6.06 కోట్లతో నిర్మించనున్నామన్నారు. మేడ్చల్ లో ఆర్ యు బి చిన్నగా నిర్మిస్తున్నందున, అదనపు నిధులు మంజూరు చేసి పొడగించనున్నామన్నారు. గౌడవెల్లి దగ్గర సింగిల్ లైన్ ఆర్ యు బి కి అదనపు నిధులు మంజూరు చేయనున్నామని తెలిపారు.
గుండ్ల పోచంపల్లి దగ్గర ఆర్ యు బి మంజూరు అయినప్పటికీ భూసేకరణ చేయనందున అసంపూర్తిగా ఉందని, భూసేకరణకు కేంద్ర ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయించి వంతెన పూర్తి చేస్తామన్నారు. అల్వాల్, నేరేడుమెట్లలో ఆర్ యు బి లో మంజూరు చేశామని, ఎం ఎం టి రైల్వే స్టేషన్ కూడా ప్లాన్ చేస్తున్నామని ఆయన వివరించారు. వాజ్పేయి నగర్ లో ఆర్ యు బి కి గతంలో నిధులు మంజూరు కాగా శిలాఫలకం వేశారని, కానీ అది రద్దు అయిందని, కొత్తగా అక్కడ వంతెన మంజూరు చేస్తామని తెలిపారు.
ఫతేనగర్ వంతెన మెట్లు కూలిపోయి ఇద్దరికి గాయాలైన నేపథ్యంలో రైల్వే అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడ ప్రజలు ఎక్కువగా రైల్వే లైన్లు దాటుతున్నారో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు నిర్మించాలని ప్రతిపాదించామన్నారు.
వరంగల్ నేషనల్ హైవే పైన ఎన్ టి పి సి చౌరస్తా, ఘట్కేసర్, మైసమ్మ గుట్ట, బీబీనగర్ చౌరస్తాలలో ప్రమాదాలు జరిగి ఎక్కువమంది చనిపోతున్నందున పార్లమెంటులో ఈ విషయం ప్రస్తావించగా నాలుగు చౌరస్తాలలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 102 కోట్లు మంజూరు చేసిందన్నారు.