27-11-2025 04:34:17 PM
ఇచ్చోడ (విజయక్రాంతి): మండలం కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ, జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలను పొగాకు రహిత పాఠశాలగా గుర్తించడం జరిగిందని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన పొగాకు రహిత యువతకై ప్రచారం 3.0లో భాగంగా గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వాడకం మూలంగా కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమన్నారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం మరియు కొనిపించడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.