26 February, 2026 | 4:38 AM

మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ

26-02-2026 01:05 AM

అభ్యర్థుల వివరాలు విడుదల 

హైదరాబాద్, ఫిబ్రవరి 25(విజయక్రాంతి) : రాష్ర్టంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల ప్రాథమిక వివరాలను బుధవారం విడుదల చేసింది.

ప్రస్తుతం బోర్డు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే, అభ్యర్థులు తమ ఫిర్యాదులను ఈనెల 28 వరకు సమర్పించుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తులో దొర్లిన తప్పులు లేదా మెరిట్ లెక్కింపులో వ్యత్యాసాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వెంటనే, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తుది మెరిట్ జాబితాను బోర్డు సిద్ధం చేయనుంది.

మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి, మార్చి చివరి నాటికి నియామక పత్రాలను అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ మొదటి వారం కల్లా కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరతను తీర్చడానికి ఈ నియామకాలు అత్యంత కీలకం కానున్నాయి.