మైనింగ్ ప్లాన్ ముసాయిదాలో సంస్కరణలు
- బొగ్గు తవ్వకాల్లో స్థిరత్వం, నైతికత కోసమే సవరణలు
- జాబితాను విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్ , జూన్ 20(విజయక్రాంతి): దేశీయంగా బొగ్గు తవ్వకంలో ఇటీవల గణనీయమైన మార్పులు వచ్చాయి. ఫలితంగా ఉత్పత్తి పెరిగి మైనింగ్ రంగం కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా వాణిజ్య గనుల హవా ప్రారంభమైన తర్వాత దేశీయ బొగ్గు ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో భారత మైనింగ్రంగాన్ని మరింత ముందుకు తీసుకుకెళ్లడంతో పాటు నియంత్రించేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ముసాయిదాలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. పర్యావరణానికి ప్రాధాన్యత, ప్రజల సమస్యలు పరిష్కరించడం, బొగ్గు తవ్వకంలో స్థిరత్వం, నైతికతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ఈ సవరణలు చేసింది. ఈ సంస్కరణలపై జులై 1వ తేదీలోగా అభ్యంతరాలను చెప్పాలని బొగ్గు గనుల శాఖ పేర్కొంది.
కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలు..
v గనులు లీజుకు తీసుకున్న ప్రాంతాల్లో లభించే ఇతర వాణిజ్యపరంగా విలువైన ఖనిజాలను గుర్తిస్తే వాటిని రాష్ర్ట ప్రభుత్వాలకు తప్పనిసరిగా నివేదించాలి.
v మైనింగ్ ప్లాన్లో చిన్న మార్పులు లేదా పెద్ద మార్పులకైనా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ) అనుమతి అవసరం.
v నిర్ణీత లక్ష్యాలను దాటి వార్షిక బొగ్గు ఉత్పత్తిని సాధించడానికి అనుగుణంగా క్యాలెండర్ ప్లాన్ రూపొందిచండం.
v బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో పేలుడు రహిత, అంతరాయాలకు చెక్ పెట్టేందుకు సాంకేతికతను ఉపయోగించడం.
v భద్రతా ఆడిట్లతో సహా బొగ్గు గనుల నిబంధనలు 2017 ప్రకారం సమగ్ర భద్రతా నిర్వహణ ప్రణాళికలను అమలు చేయడం.
v సంబంధిత పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి మైనింగ్ ఫ్లుయాష్ ఫిల్లింగ్ ప్రోటోకాల్ పాటించడం.
v బొగ్గు గనుల్లో నిల్వ చేయడానికి ఇసుకను సమకూర్చడం.
v బొగ్గు నిల్వలను పరిరక్షించేందుకు పక్క గనుల్లో కోల్ వెలికితీతను అడ్డుకోవడం.
v బొగ్గు బ్లాకుల వెలుపలి ప్రాంతాల్లో ఓవర్ బర్డెన్ డంపింగ్
v వేలం లేదా కేటాయింపు ద్వారా కేటాయించిన బొగ్గు బ్లాకుల కోసం డీజీపీఎస్ సర్వేల ఆధారంగా సరిహద్దుల ధ్రువీకరణ.
v -బొగ్గు గనుల కార్యకలాపాల్లో భద్రత, సామర్థ్యం, ఇంటర్ఆపరేబిలిటీని నిర్ధారించడానికి హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ సదుపాయం.
v పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం, బొగ్గు తరలింపు కోసం కన్వేయర్ బెల్ట్లు లేదా రైల్వే రవాణాను తప్పనిసరిగా ఉపయోగించడం.
v 2009 తర్వాత వదిలివేయబడిన లేదా నిలిపివేయబడిన గనుల కోసం తాత్కాలిక బ్లాక్ల మూసివేత ప్రణాళికలను సిద్ధం చేయడం.






