15-05-2025 12:27:04 AM
చేవెళ్ల, మోకిల పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్
అర్మూర్, మే14 : శంకర్ పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీచేసింది. అయితే దర్యాప్తుకు సహకరించాలని కోర్టు జీవన్ రెడ్డిని ఆదేశించింది.
ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నమోదైన అక్రమ కేసు అని జీవన్ రెడ్డి తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, ఎస్ నిరంజన్ రెడ్డి, మహపూజ్ నజకీ ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఎలాంటి తప్పులు చేయకపోయినా తనపై, తన కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతల వత్తిడి మేరకు ఏ తప్పులు జరగకపోయినా ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి మాల్ ను అధికారులు సీజ్ చేశారు. దీనిపై న్యాయపోరాటం ఫలించి జీవన్ రెడ్డి మాల్ ను తిరిగి తెర్చుకుంది. అసలు వివాదమే లేని శంకర్ పల్లి భూములకు సంబంధించి కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో ఎవరో ఇచ్చిన తప్పుడు పిర్యాదు మేరకు చేవెళ్ల, మోకిల పోలీసు స్టేషన్లో తనపై, సతీమణి రజితా రెడ్డి, 70 ఏళ్ల వృద్ధురాలైన తల్లిపై అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.
ఈ కేసుల్లో జీవన్ సతీమణికి, తల్లికి ముందే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంలో అప్పటి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులు తిరగతోడుతుండడమే కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచే బూటకపు కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు తనపై 40కేసుల వరకూ అక్రమంగా నమోదు చేసి వేధిస్తు న్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని, బెదిరింపులకు లొంగేదిలేదన్నారు. న్యాయస్థానాలపై తనకు అచంచలమైన విశ్వాసం ఉందన్నారు.