13-11-2025 12:15:58 AM
విచారణను జనవరి 19కి వాయిదా వేసిన హైకోర్టు
ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని జోషి, స్మితా సబర్వాల్, కేసీఆర్, హరీశ్ పిటిషన్
హైదరాబాద్, నవంబర్ 12: కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్కు ఊరట లభించింది. కాళేశ్వరం కమిషన్పై విచారణను హైకోర్టు జనవరి 19వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు అంతకు ముందుకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తున్నట్లుగా పేర్కొంది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జీఎం మోయినుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవా రం మరోసారి విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 19వ తేదీకి వాయిదా వేసింది.
అదేవిధంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్కి సమాధానం ఇచ్చేందుకు నలుగురు పిటిషనర్లకు మరో మూడు వారాల సమయం ఇచ్చింది. అప్ప టి వరకు కేసులో అంతకు ముందు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. గతం లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.