18-06-2025 12:00:00 AM
82\2\1\1 నిజాంసాగర్ కాల్వకు చెందిన ఒక ఎకరం 38 గుంటల భూమి స్వాధీనం
ఆర్మూర్, జూన్ 17 (విజయ క్రాంతి) : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని 63 నంబర్ జాతీయ రహదారి వెంట కబ్జాకు గురైన 82\2\1\1 నిజాంసాగర్ డిస్ట్రిబ్యూషన్ కాలువ స్థలంలో ఆక్రమణలను మూడు ప్రభుత్వ శాఖలైన రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు మంగళవారం తొలగించారు.
సుమారు ఏడు నెలల క్రితం 63వ జాతీయ రహదారి వెంట కోటార్ము రెవిన్యూ లోని సర్వే నంబర్ 40\1 మధ్యనుండి వెళ్లిన నిజాంసాగర్ డిస్ట్రిబ్యూషన్ కాలువ నెంబర్ 82/2/1/1 చెందిన ప్రభుత్వ స్థలం ఒక ఎకరం 28 గుంటల స్థలానికి ఇటీవల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి, కెనాల్ భూమికి హద్దులు ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, కలెక్టర్ దృష్టికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డిలు పలు మార్లు తీసుకొని వెళ్లారు.
ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్య జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, రెవిన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి, హద్దులు గుర్తించి నిజాంసాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రభుత్వ నిజాంసాగర్ కెనాల్ కు చెందిన ఒక ఎకరం 38 గుంటల భూమిలో గల అక్రమ నిర్మాణాలను ఆర్మూర్ తహసిల్దార్ సత్యనారాయణ, ఇరిగేషన్ డి ఈ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ రాజులు మంగళవారం జెసిబి సహాయంతో మూడు ప్రభుత్వ శాఖల సిబ్బంది చేత తొలగించారు.
ఇటీవల అధికారులు గుర్తించిన నిజాంసాగర్ కెనాల్ హద్దుల తొలగించడమే కాకుండా మంగళవారం విధులకు ఆటంకం కలిగించినందుకు అక్రమాదరులపై కేసు నమోదుకు ఫిర్యాదులు చేసినట్లు ఇరిగేషన్ డి ఈ కృష్ణమూర్తి, ఆర్మూర్ తాసిల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రాజులు చెప్పారు. నిజాంసాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ, ఇరిగేషన్, అధికారులు మున్సిపల్ అధికారుల సహాయంతో తొలగించడం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఒక రియల్టర్ ప్రభుత్వానికి చెందిన సుమారు రెండు ఎకరాల 38 గుంటల స్థలాన్ని కబ్జా చేసుకుని అమ్మకాలు చేయడం ఏంటని, జాతీయ రహదారి ప్రక్కన గల ఈ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందని, లేదా ప్రభుత్వ ఆధీనంలో మడిగిన నిర్మించి ప్రజలకు తక్కువ ధరకు కేటాయిస్తే వీలైన వ్యాపారాలు చేసుకొని ప్రజలు అభివృద్ధి చెందుతారని పలువురు పేర్కొన్నారు.
నిజాంసాగర్ ప్రభుత్వ కెనాల్ స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనంతరం ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే మున్సిపల్ శాఖకు ప్రభుత్వ స్థలాన్ని అప్పగించి ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.