17-06-2025 11:37:13 PM
తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు యూనియన్స్ ఐక్య కార్యచరణ సమితి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఉపాధి దెబ్బతిని తమ కుటుంబాలను పోషించుకోలేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆర్థికంగా ఆదుకోలేని ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కొత్తగా ఆటో పర్మిట్లు ఇచ్చి అక్రమ దందాకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ తెరలేపుతుందని తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు యూనియన్స్ ఐక్య కార్యచరణ సమితి నేతలు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకునేలా చేసి పరోక్షంగా ఆటో డ్రైవర్లను హత్యలు చేస్తుందని వారు ఆరోపించారు.
ఈ మేరకు మంగళవారం హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అట్లూరి రవిశంకర్, టీఎఓడీఎ మంద రవికుమార్ మాట్లాడుతూ... అసలే ఆటోలు నడవక గిరాకీలు దెబ్బతిని ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతుంటే మరిన్ని కొత్త ఆటోలకు పర్మిషన్ ఇవ్వడం అంటే ఆత్మహత్యలను ప్రోత్సహిస్తుందని అనడంలో సందేహం లేదన్నారు.
మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే ఆటో పర్మిట్ జీఓను అమలు చేయాలని, అదనంగా కొత్త పర్మిట్లు ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలని, ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలు పాత ఆటో పర్మిట్ల స్థానంలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్సర్లు, డీలర్ల బెదిరింపులు, దోపిడీలను అరికట్టాలని, ఏటా రూ.12 వేల హామీని ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమితి నేతలు టీఎడీయు కొమురయ్య, బీఎంఎస్ పెంటయ్య గౌడ్, టీఎస్ఏడీయూ నందకిషోర్, జీహెచ్ఏడీయు శ్రీనివాస్, జీహెచ్ఏవీడీయూ వజ్రలింగం, టీఆర్ఏకేటీయు ఈశ్వర్, టీఎస్ పీటీఎంఎం శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.