ఆర్మీ భూములు కాపాడాలంటూ హైడ్రాకు ఫిర్యాదు
హైడ్రా కమిషనర్ను కలిసిన ఆర్మీ లెఫ్ట్నెంట్ కల్నల్
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ఆర్మీకి చెందిన భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని, ఆ భూమిని కాపాడాలని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా(HYDRAA) కమిషనర్ ఏవీ. రంగనాథ్ ని ఆర్మీ లెఫ్ట్నెంట్ కల్నల్ జై సింగ్ కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, గ్రామంలోని జీఎల్ఆర్ సర్వే నంబరు 507లోని ఆర్మీకి చెందిన ఏ-1 భూమి ఉండగా అందులో ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆర్మీకి చెందిన భూమిని ఆక్రమించి జీ+2 భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఆ నిర్మాణానికి అనుమతులు కూడా లేవని పేర్కొన్నారు. వెంటనే నిర్మాణాలను నిలిపివేసి ఆ స్థలాన్ని కాపాడాలని ఆయన కోరారు. వినతిపత్రాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆక్రమణలను నిర్ధారించుకున్న తర్వాత చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.






